- కిలోకు రూ.14 నష్టంతో వదిలించుకున్న సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్
- కిలోకు రూ. 22 కోట్ చేసిన బిడ్డర్లు
- ఏడాదిన్నర తర్వాత రూ. 1.10 కోట్ల నష్టంతో ఓకే చెప్పిన సివిల్ సప్లయ్
- తరుగు బాధ్యత రేషన్ డీలర్లదే..
యాదాద్రి, వెలుగు : ఏడాదిన్నర తర్వాత రేషన్ షాపుల్లోని దొడ్డు బియ్యం కథ ముగిసింది. కిలోకు రూ.14 నష్టంతో సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్ ఆ బియ్యాన్ని వదిలించుకుంది. ఎట్టున్న బియ్యం అట్లనే తీసుకొని పోవాలన్న నిబంధనతో తెలంగాణ, ఆంధ్రకు చెందిన ఇద్దరు బిడ్డర్లు ఆ బియ్యాన్ని టెండర్లో దక్కించుకున్నారు.
ఏడాదిన్నరగా..
రేషన్ కార్డుదారులకు గతేడాది మార్చి వరకూ దొడ్డు బియ్యం పంపిణీ జరిగింది. ఏప్రిల్ 2025 నుంచి ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. దీంతో యాదాద్రి జిల్లాలోని 515 రేషన్ షాపుల్లో 774 టన్నుల దొడ్డు బియ్యం నిల్వలు అలానే ఉండిపోయాయి. రైతుల నుంచి వడ్ల కొనుగోలు, ట్రాన్స్పోర్ట్తో పాటు మరాడించిన చార్జీలు కలుపుకుంటే కిలో బియ్యానికి రూ. 36 అవుతోంది. అయితే ఈ బియ్యానికి రూ. 12 చొప్పున తగ్గించి ‘జెమ్ పోర్టల్’ ద్వారా ఈ ఏడాది మొదట్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దొడ్డు బియ్యాన్ని ఒకే లాట్గా గ్లోబల్ టెండర్లు పిలిచారు. కానీ గడువు ముగిసినా ఏ ఒక్కరూ బిడ్లు దాఖలు చేయలేదు.
మరింత తగ్గించుకొని..
ఏడాదిన్నరగా నిల్వ ఉండడంతో బియ్యానికి పురుగు పడుతోంది. దీంతో బియ్యం వెయిట్ కూడా తగ్గుతోంది. ఈ పరిణామంతో డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్మరోసారి టెండర్లు పిలించి, ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లోనూ బిడ్లు దాఖలు చేయాలని ప్రకటనలు ఇచ్చింది. దీంతో సూర్యాపేట జిల్లా హుజూర్నగర్, ఏపీలోని నందిగామకు చెందిన ఇద్దరు వ్యాపారులు బియ్యం విలువలో 5 శాతం అమౌంట్ఈఎండీ చెల్లించి టెండర్లలో పాల్గొన్నారు. నాలుగు ఎంఎల్ఎస్ పాయింట్లలోని బియ్యానికి టెండర్ వేసిన కాంట్రాక్టర్ కిలోకు రూ. 21.15 చొప్పున కోట్ చేస్తూ బిడ్ దాఖలు చేశారు. ఒక ఎంఎల్ఎస్ పాయింట్లోని బియ్యం కొనుగోలు కోసం కిలో రూ. 22.10 చొప్పున మరో కాంట్రాక్టర్ బిడ్లు దాఖలు చేశారు.
తరుగు బాధ్యత వాళ్లదే..
ఎంఎల్ఎస్ పాయింట్ల పరిధిలోని రేషన్ షాపుల్లో స్టాక్ ఉన్న బియ్యంలో ఎలాంటి తరుగు ఉన్నా సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్ బాధ్యత వహించదు. ఏడాదిన్నర కింద ఎన్ని క్వింటాళ్ల బియ్యం ఉన్నాయో అన్ని క్వింటాళ్ల బియ్యాన్ని టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లకు రేషన్ డీలర్లు అప్పగించాల్సి ఉంటుంది. దీనివల్ల తమకు నష్టం కలుగుతుందని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రూ. 1.10 కోట్ల నష్టం...
ఇతరులు ఎవరూ బిడ్లు దాఖలు చేయక పోవడంతో కిలోకు రూ. 14 నష్టం కలుగుతున్నా ఇద్దరి టెండర్లను సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్ ఓకే చేసింది. దీంతో దాదాపు రూ1.10 కోట్ల నష్టం వాటిల్లనుంది. కాగా, ఈ ఇద్దరు కాంట్రాక్టర్లు తాము దక్కించుకున్న బియ్యం విలువలో మరో 10 శాతం అమౌంట్ సివిల్ సప్లయ్కు అడ్వాన్స్గా చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఎక్కడ ఉన్న బియ్యం ఎలా ఉన్నా అలానే తీసుకోవాల్సి ఉంటుంది. బియ్యం తీసుకోకపోతే ఈఎండీ, అడ్వాన్స్గా చెల్లించిన అమౌంట్ను డిపార్ట్మెంట్తిరిగి ఇవ్వదు.
